తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు

No Comments

ఉన్నత చదువులు చదవాలనే కోరికతో... ఎన్నో ఆశలతో రెక్కలు కట్టుకుని విద్యార్థులు అమెరికాలో వాలిపోతారు . అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్న ప్రచారం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని బయలుదేరిన వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. 

కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ సిలికాన్ వ్యాలీ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 40 మంది విద్యార్థులను అబుదాబీ ఎయిర్ పోర్టులోనే ఆపివేశారు. వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు 10 మంది ఉండగా ఆయా రాష్ట్రాల విద్యార్థులు 30 మంది వరకు ఉన్నారు. వీరిలో 10 మంది హైదరాబాద్ - ముంబై మీదుగా అబుదాబి చేరుకున్నారు. ఎతిహాద్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో బయలుదేరిన వీరిని అబుదాబి ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కనెక్టింగ్ ఫ్లయిట్ బోర్డింగ్ కు అనుమతించలేదు. పైగా పాస్ పోర్టులను లాగేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి ఒక అధికారి వచ్చి బుధవారం ఉదయం ఫ్లయిట్ ఏర్పాటు చేస్తున్నారని అందరినీ ఇండియాకు పంపిస్తారని చెప్పారు. పాస్ పోర్టులను మాత్రం వారికి ఇవ్వలేదు.

ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గత వారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు. అలాగే రెండు రోజుల కిందట  ఎయిర్ ఇండియా అధికారులు మరో 19 మంది విద్యార్థులకు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచే తిప్పిపంపారు. ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరిస్తున్న దశలో విద్యార్థులు ఆయా యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. పారిస్ లో దాడుల ఘటన తదనంతరం భద్రతా చర్యలు ముమ్మరం చేయడంవల్ల సెక్యూరిటీ పరమైన అంశాలే తప్ప ఇతరత్రా ఇబ్బందులు లేవని సమాచారమిచ్చాయి.

ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో బయలుదేరామని ఎవరో ఎక్కడో చేసిన తప్పిదానికి మమ్మల్ని బలి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అబుదాబిలో నానా కష్టాలు పడుతున్న వారికి తమ భవిష్యత్తు ఏమిటో అర్థంకాక బాధపడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు రెండు రోజులుగా అబుదాబిలో ఆగిపోతే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.